
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునను కలిశారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన ఆయన కాసేపు వారితో ముచ్చటించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ట్విటర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మీరు మమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని చిరు తన ట్వీట్ లో తెలిపారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ సాధిస్తున్న పురోగతి గురించి నాగార్జునతో కలిసి మీతో చర్చించడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ కోసం సమయం కేటాయించినందుకు మంత్రి అనురాగ్ ఠాకూర్ కు చిరు ధన్యవాదాలు తెలిపారు.