నర్సింగ్​ కాలేజీ ఎదుట ఆందోళన ఉద్రిక్తం

నర్సింగ్​ కాలేజీ ఎదుట ఆందోళన ఉద్రిక్తం
  •     తమ బిడ్డ మృతికి న్యాయం చేయాలంటూ ఆందోళన
  •     కరస్పాండెంట్ పై దాడికి యత్నం
  •     భద్రాచలంలో తీవ్ర ఉద్రిక్తత

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని మారుతి పారా మెడికల్​ కాలేజీ బిల్డింగ్​పై నుంచి పడి చనిపోయిన బీఎస్సీ నర్సింగ్ ​విద్యార్థిని కారుణ్య కేసు విషయంలో న్యాయం చేయాలంటూ శుక్రవారం కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి. మెదక్​ జిల్లాకు చెందిన కారుణ్య ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని మామ ఇంట్లో ఉంటూ నర్సింగ్​ చదువుతోంది. గురువారం తెల్లవారుజామున కారుణ్య మేడపై నుంచి పడి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కారుణ్య కుటుంబసభ్యులు శుక్రవారం కాలేజీ వద్దకు ప్రజాసంఘాల నాయకులతో వచ్చి ఆందోళన చేశారు.

కరస్పాండెంట్​డా.ఎస్.ఎల్​కాంతారావు కాలేజీ వద్దకు కారులో రాగా చుట్టుముట్టారు. కాంతారావుతో పాటు ఆయన డ్రైవర్​పైనా దాడికి యత్నించారు. పోలీసులు వారిని సురక్షితంగా ఆయన ఛాంబర్​లోకి తీసుకెళ్లారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, అడిషనల్ ​డీఎం​హెచ్​వో వచ్చి న్యాయం చేయాలని, కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. కానీ,  ఆయనపైనా తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సీఐ సంజీవరావు బందోబస్తు ఏర్పాటు చేశారు.

చివరకు కాలేజీ యాజమాన్యం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రూ.25లక్షలకు సెటిల్​మెంట్​అయ్యిందందటూ ప్రచారం జరగ్గా, చట్టవిరుద్దంగా సెటిల్​మెంట్​ చేశారంటూ కొందరు ప్రజాసంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు