ధోనీ కోసం బుల్లెట్‌కైనా ఎదురెళ్తా

ధోనీ కోసం బుల్లెట్‌కైనా ఎదురెళ్తా

లండన్: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి క్రికెట్ ప్రపంచంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గడం లేదు. భారత జట్టుకు అత్యుత్తమ విజయాలు అందించిన ధోని.. యంగ్ ప్లేయర్లకు చాన్సులు ఇస్తూ ప్రోత్సహించాడు. అందుకే అతడి వ్యక్తిత్వానికి, ఆటతీరుకు ఫ్యాన్స్‌తోపాటు ప్లేయర్లు కూడా ఫిదా అయిపోతారు. ఇలాంటి వారిలో ప్రస్తుత భారత జట్టులో కీలక ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ధోని సారథ్యంలో తాను ఎక్కువ మ్యాచ్‌లు ఆడనప్పటికీ ఆయనతో డ్రెస్సింగ్ రూమ్‌లో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నాడు. 

ధోని కోసం బుల్లెట్‌ను ఎదుర్కోవడానికైనా తాను రెడీనని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘ఎవరైనా కెప్టెన్ల గురించి మాట్లాడితే నాకు తొలుత గుర్తొచ్చే పేరు ధోనీనే. మేం అందరమూ ఆయన నేతృత్వంలో ఆడాం. ఆయన సారథ్యంలో ఎన్నో టోర్నమెంట్లలో భారత్ నెగ్గింది. దేశం కోసం ఆయనెంతో సేవ చేశారు. అయితే వీటన్నింటి కంటే కూడా ఓ కెప్టెన్‌గా సహచర ప్లేయర్ల నుంచి గౌరవాన్ని అందుకోవడమే అతిపెద్ద ఘనతగా చెప్పుకోవచ్చు. అది ధోని సాధించాడు. ఆయన కోసం మేం బుల్లెట్‌కైనా ఎదురెళ్తాం. దీంట్లో మరో ఆలోచనే లేదు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సమస్యలు ఎదురైనా వినమ్రంగా ఉంటూ వాటిని ఎదురొడ్డి ముందకు దూసుకెళ్లిన ధోనీ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని రాహుల్ మెచ్చుకున్నాడు.