
ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి ల్యాండ్ పూలింగ్ కి ప్రభుత్వం సిద్దమైన సంగతి తెలిసిందే. మంగళవారం ( జూన్ 24 ) జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పార్థసారథి. ఏపీ సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ స్కిం ప్రకారం మరో విడత భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్...విద్యా సంస్థలు.. ఆసుపత్రులు అందించే విధంగా భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని అన్నారు మంత్రి పార్థసారధి.
2015 లో కూడా 35 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగిందని.. అసైన్మెంట్ భూముల విషయంలో స్థానిక అధికారులుతో విచారణ తర్వాత భూ సమీకరణ జరుగుతుందని అన్నారు. అన్ని నియమ నిబంధనలు ప్రకారం ఆధార్ , పాస్ పోర్ట్ వివరాల ఆధారంగా ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి పార్థసారధి. రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చే వారికి మెరుగైన ప్యాకేజ్ అందిస్తున్నామని అన్నారు.
ఈ ఏడాదిలో 25 క్యాబినెట్ సమావేశాలు జరిగాయని.. కొన్ని వందల నిర్ణయాలు ఇప్పటి వరకు తీసుకున్నామని అన్నారు మంత్రి పార్థసారధి. గతంలో లాగా సీఎంకు ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ పెట్టడం, సీఎంకు ఇష్టమైన ఎజెండాతో క్యాబినెట్ సమావేశాలు పెట్టలేదని అన్నారు.మంత్రుల అభిప్రాయంతో స్పష్టమైన నిర్ణయాలు తీస్కుంటున్నామని.. 10 సెంట్ల స్థలం నుంచి ఎకరాల కేటాయింపు వరకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీస్కుంటున్నామని అన్నారు.
అమరావతిలో జిఎడి టవర్, హెచ్ ఓ డి టవర్లు, ఎన్సీసి, షాపూర్ జి పల్లోంజీ, ఎల్ అండ్ టీ కి టెండర్ ఆర్డర్ ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.మున్సిపల్ శాఖలో 40 టౌన్ ప్లానర్ పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు మంత్రి పార్థసారధి.