చిత్తూరు: చిన్నారి వర్షిణి హత్య ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఇంతటి దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని సీఎం పోలీసులను ఆదేశించారు.
రెండు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లిన వర్షిణిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా కళ్యాణమండపంలో సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా స్నేహితులతో ఆడుకుంటున్న చిన్నారిని ఓ వ్యక్తి ఫోటోలు తీసి ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతున్న దృశ్యాలు గుర్తించారు. అందులో ఉన్న పోలీకల ప్రకారం అతడి ఊహా చిత్రం విడుదల చేశారు. మొత్తం ఐదు బృందాలతో ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వర్షిణి తల్లిదండ్రులకు ఎవరితోనైనా ..పాత గొడవలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.