ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ మధ్య ట్వీట్ వార్ జరిగింది. ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుందని, ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీని తిరస్కరించేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ట్విటర్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. అవును రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికారమార్పు కోరుకుంటున్నారని అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. హోదాతో రాష్ట్రాన్ని ఆదుకుంటామన్న హామీలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి కౌంటరిచ్చారు.
నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెచ్చి, పేదవారి బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తామన్న హామీలు ఏమయ్యాయని బాబు ప్రశ్నించారు. బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ? అని ప్రశ్నించారు.
ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తున్న మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా లేదూ’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కుప్పకూలుస్తున్న మీ పాలనకు త్వరలోనే ముగింపు పలకాని ప్రజలు నిర్ణయించుకున్నారని చంద్రబాబు ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు.