హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులను తానెప్పుడూ అడ్డుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ వినియోగించుకోవచ్చని చెప్పారు. సోమవారం అమరావతిలోని సెక్రటేరియెట్లో మంత్రులు, వివిధ శాఖల చంద్రబాబు రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు అని, ఇది పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదన్నారు.
“ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం వల్ల శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ (తెలంగాణ) నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.
