
అమరావతి: కోవిడ్ చికిత్సలకు ఎక్కువ రేట్లు పెంచడంపై సీరియస్ అయ్యారు సీఎం జగన్. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు. కోవిడ్ బాధితుడికి అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. 104, 14410 కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్.. కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు.
కోవిడ్ ఆస్పత్రులలో సౌకర్యాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించాలన్న సీఎం..కోవిడ్ ఆస్పత్రిల సేవలు నాణ్యంగా ఉండాలన్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. సీసీ కెమెరాల ద్వారా కోవిడ్ ఆస్పత్రులను మానిటరింగ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు పర్యవేక్షించాలని.. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు నిరోధించే పరికరాలు ఉండేలా చూడాలని సూచించారు సీఎం జగన్.