ఏపీ సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ లో మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. 'స్పందన' కార్యక్రమానికి మెరుగైన రూపమే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం అని వెల్లడించారు. ఇందుకోసం 1902 నెంబరును అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. సమస్యల పరిష్కారంపై నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
స్కూళ్లు తెరిచిన రోజే విద్యాకానుక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ళల్లో నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయన్నారు.. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని తెలిపిన ఆయన.. తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఐఎఫ్పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేలకు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. జూన్ 12 లోగా ఈ ఐఎఫ్ఎప్ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.. నెలకొసారి తప్పనిసరిగా డిజిటల్ డేగా పరిగణించాలని సూచించారు.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని.. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని.. దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
ప్రతి కాలేజీలో ఎస్ఈబీ టోల్ ఫ్రీ నంబరు
డ్రగ్స్ అంశంపై స్పందిస్తూ ... డ్రగ్స్ తయారీ, రవాణా, పంపిణీలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్లు ఏర్పాటు చేయాలని, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ప్రతి కళాశాలలోనూ ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబరు ప్రదర్శించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఏపీలో ప్రతి శనివారం హౌసింగ్ డే
సొంత ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం జగన్ అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి అన్ని కాలనీల్లో కనీస మౌలిక వసతులైన విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.ఎప్పటికప్పడు ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ, గృహనిర్మాణ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారిక యంత్రాంగం ఎప్పటికప్పుడు తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పాటిస్తున్నామని, ఆ రోజు తప్పకుండా తనిఖీ బృందాలు లే అవుట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని అధికారులు ఆయనకు తెలియజేయగా.. వాటి వివరాలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.పేదల ఇళ్లకార్యక్రమానికి నిధుల లోటు లేదన్నారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుందని సీఎం జగన్ అన్నారు. ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.