- రాయలసీమ రిజర్వాయర్లన్నీ నింపుతం
- కర్నూలు జిల్లా నంద్యాలలో ఏపీ సీఎం జగన్
అమరావతి, వెలుగు: తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడి రాయలసీమకు గోదావరి జలాలను తీసుకొస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గోదావరి నీళ్లు పోలవరం ప్రాజెక్టులోకి చేరే ముందే రాయలసీమలోని రిజర్వాయర్లన్నీ నింపుతామన్నారు. కృష్ణా, గోదావరి అనుసంధానం చేసి కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణతో కలిసి చేపట్టే ఉమ్మడి ప్రాజెక్టుతో రాయలసీమ కరువును శాశ్వతంగా దూరం చేస్తామని చెప్పారు. శనివారం కర్నూలు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. నంద్యాల, ఆళ్లగడ్డలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. నంద్యాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లాలో వరదల వల్ల రూ. 784 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.