ఆంక్షలు కొనసాగుతాయి : రాష్ట్రంలో అడుగుపెట్టేవారికి పాసులు తప్పని సరి : డీజీపీ సవాంగ్

ఆంక్షలు కొనసాగుతాయి : రాష్ట్రంలో అడుగుపెట్టేవారికి పాసులు తప్పని సరి : డీజీపీ సవాంగ్

రాష్ట్రంలో అడుగు పెట్టే వారికి అనుమతి తప్పనిసరని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. థర్మల్ స్క్రీనింగ్  చేశాకే అనుమతిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతి ఇస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. అనుమతి కోసం స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ పొందాలని డీజీపీ సూచించారు.

పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. ప్రజలు వ్యక్తి గత జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. బయటికి వస్తే మాస్కు తప్పనిసరి అన్న డీజీపీ.. కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని హెచ్చరించారు.