ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలను 25వ తేదీవరకు రోజుకు రెండు సెషన్లు గా మొత్తం 14సెషన్లలో నిర్వహించనున్నారు. కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన చర్యలను తీసుకున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ,హైదరాబాద్ లో కలుపుకుని 47 ప్రాంతాల్లో 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి సెషన్ ఉదయం గం.9-12 వరకు,రెండో సెషన్ మధ్యాహ్నం గం.3-6 వరకు ఉంటుంది. గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిని ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదు. ఈ-హాల్ టికెట్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని నింపి సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంది.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా మాస్క్, చేతి గ్లోవ్స్ ధరించాలి. 50 ఎంఎల్ శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటిళ్లను లోపలకు అనుమతిస్తారు. హాల్ టికెట్తో పాటు మరో అధికారిక ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. పరీక్ష సమయం ముగిన తర్వాతనే అభ్యర్థులను బయటకు పంపిస్తారు.