ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్నికలను వాయిదా వేసిందని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆ పిటిషన్ లో తెలిపింది. ఈ పిటిషన్ను ఆమోదించిన సుప్రీంకోర్టు.. మంగళవారం దీనిపై విచారణ చేపట్టనున్నది.
పిటిషన్ లో ప్రధాన అంశాలు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధం.
- కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత అవకాశముంటుంది.
- హై కోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం సమంజసం కాదు.
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలి.