- మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ
వనపర్తి/మదనాపురం/కొత్తకోట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం నిధుల తోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటుతున్నా మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అమృత్ పథకం కింద ఆత్మకూరు మున్సిపాలిటీకి రూ.17 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. వీటి ద్వారా చెరువులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి కోసం రూ.3.40 కోట్ల నిధులు ఇచ్చామని, కేంద్రం 60 శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40శాతం ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, జడ్పీ మాజీ చైర్ పర్సన్ లోక్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రభాకర్రెడ్డి, పవన్ కుమార్, వెంకట్రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.
