కరోనా ఎఫెక్ట్ తో గత నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కొంత శాతం మేర వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ జీతాల విషయంలోనూ అదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నెల జీతాల చెల్లింపుపై ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జారీ చేసిన జీవోలో రిటైర్డ్ ఉద్యోగులకు ఒక రిలీఫ్ ఇచ్చింది. గత నెలలో పెన్షన్లలోనూ కోత విధించిన ప్రభుత్వం ఏప్రిల్ నెలలో పెన్షనర్లకు 100 శాతం చెల్లింపులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మిగతా ఉద్యోగులకు మాత్రం గత నెల మాదిరిగానే జీతాల చెల్లింపు ఉంటుంది. అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, పారిశుధ్య ఉద్యోగులకు 100 శాతం జీతాలు ఇవ్వనుంది ప్రభుత్వం.
గత నెలలో ఇలా..
- సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని రకాల ప్రజాప్రతినిధుల జీతాల్లో 100 శాతం వాయిదా.
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో 60 శాతం వాయిదా.
- ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా.
- నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం వాయిదా.
- ఆయా విభాగాలల్లో పని చేసి రిటైర్ అయినా పెన్షనర్లకు ఆ కేడర్ల ఉద్యోగులకు జీతం వాయిదా ప్రకారమే పెన్షన్ కూడా డిఫర్మెంట్ ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఏప్రిల్ కు సంబంధించిన పెన్షన్లను 100 శాతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.