
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఏపీలో ఉద్యోగం చేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సెక్రటేరియెట్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా సెలవు ఇచ్చారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు జిల్లాలో పనిచేస్తున్నందున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేటీఆర్ ఈసీ ఆదేశాలను బేఖాతర్
ఏపీలో ఉన్న తెలంగాణ ఓటర్లు ఓటు వేసే లాగా చర్యలు తీసుకోవాలని బుధవారం సీఈఓ వికాస్ రాజ్ను కాంగ్రెస్ లీడర్లు మల్లురవి, నిరంజన్ కోరారు. అలాగే, బీఆర్ఎస్ అధికారిక మీడియాలో కోడ్ ఉల్లంఘిస్తూ.. ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మద్యం, డబ్బు పంపిణీని కంట్రోల్ చేయాలన్నారు. సైలెంట్ పీరియడ్లో ఈసీ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ పిలుపు నిచ్చారన్నారు.