వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన AP హైకోర్టు

వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన AP హైకోర్టు

అమరావతి: పలు కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. తన ఆరోగ్యం బాగోలేదని.. ట్రీట్మెంట్ కోసం బెయిల్ ఇవ్వాలని వంశీ హైకోర్టును ఆశ్రయించాడు. వంశీ పిటిషన్‎పై గురువారం (మే 29) విచారణ చేపట్టిన హైకోర్టు.. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయూష్ ఆస్పత్రిలో చేర్పించి వంశీకి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించింది.

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసుల్లో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ లభించగా.. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో భాగంగా వంశీ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే వైద్యం కోసం బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. వంశీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. వైద్యం కోసం వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది.