తిరుమల పరకామణి కేసుపై సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు..

తిరుమల పరకామణి కేసుపై సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు..

ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్న తిరుమల పరకామణి కేసు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ( అక్టోబర్ 27 ) ఈ కేసును విచారించిన హైకోర్టు విచారణ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పరకమణిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆధారాలున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది కోర్టు. టీటీడీ ఈవో, సీబీఎస్ఓను కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పరకామణి కేసుపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే.. ఈ కేసులో నిందితుడుగా ఉన్న రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రవి కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు పరిశీలించి.. నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. పరకామణి అక్రమాలపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సాధు పరిషత్ కు చెందిన పిటిషన్ దారుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాదోపవాదాలు విన్న కోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదికి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసును సీరియస్ గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ పరకామణి నుంచి పలు విడతలుగా నగదు చోరీ చేస్తున్న సీస ఫుటేజీ బయటపడటం సంచలనం రేపింది.