- కొండాపూర్లోని క్వాక్ ఎరినా పబ్లో పట్టుబడ్డ మహిళా ఐఏఎస్ కొడుకు సహా ఏడుగురు
- యూరిన్, బ్లడ్ టెస్టుల్లో గంజాయి, డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందని ఈగల్ఫోర్స్ వెల్లడి
- తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్, నోటీసులు
- ఈవెంట్లో సినీ నటి హేమ సహా 1,500 మంది
హైదరాబాద్, వెలుగు: ఏపీ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు ఆకెళ్ల హరిత్ సారంగ్ సహా మరో ఆరుగురు గాంజా, డ్రగ్స్మత్తులో ఈగల్ ఫోర్స్కు చిక్కారు. హైదరాబాద్ కొండాపూర్లోని ‘క్వాక్ ఎరిన’ పబ్పై గురువారం అర్ధరాత్రి దాటాక ఈగల్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హరిత్ సహా ఐదుగురు గాంజా తీసుకోగా, ఒకరు మెథాంఫెటమైన్, మరొకరు బెంజోడయాజెపైన్ డ్రగ్ తీసుకొని పట్టుబడ్డారు.
ఇదే ఈవెంట్లో పాల్గొన్న నటి హేమకు కూడా ఈగల్ అధికారులు డ్రగ్ టెస్ట్ చేశారు. కాగా, ఆమెకు నెగిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఏడుగురికి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చి పంపించారు. కాగా, ఐఏఎస్ అధికారి కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి తీసుకుని గురువారం డీజే ఈవెంట్కు హాజరైనట్టు ఆధారాలు సేకరించారు.
క్వాక్ ఎరినా పబ్లో డీజే ‘బ్లాక్ కఫీ’ ఈవెంట్
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డ్రగ్ సప్లయర్లు, కస్టమర్లు డేటా సేకరించి, శివారు ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు,హైదరాబాద్, సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని పబ్బులు, హోటల్స్పై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో గల ‘క్వాక్ ఎరినా పబ్’ లో ఇంటర్నేషనల్ డీజే ‘బ్లాక్ కఫీ’ పేరుతో స్పెషల్ పార్టీ జరుగుతున్నట్టు గుర్తించింది.
ఈవెంట్లో సినీ నటి హేమ, పలువురు జూనియర్ ఆర్టిస్టులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సహా దాదాపు1,500 మందికి పైగా పాల్గొన్నారు. గురువారం డ్రై డే కావడంతో రాత్రి 10 గంటల తర్వాత లిక్కర్ సప్లయ్ చేశారు. .
నటి హేమ సహా 64 మంది అనుమానితులకు డ్రగ్ టెస్ట్
పబ్లో డీజే ఈవెంట్ జరుగుతున్న సమయంలో గురువారం అర్ధరాత్రి ఆరు బృందాలతో ఈగల్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 1,500 మందిలో అనుమానితులుగా గుర్తించిన నటి హేమ, డీజే బ్లాక్ కఫీతో పాటు 64 మందికి డ్రగ్ కిట్లతో యూరిన్ టెస్ట్లు నిర్వహించారు. ఇందులో హేమ, బ్లాక్ కఫీకి నెగిటివ్ రిపోర్ట్ రాగా, ఎనిమిది మంది యువకులకు గంజాయి, ఇతర రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.
వీరిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఉదయం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి బ్లడ్ టెస్ట్లు నిర్వహించారు. ఇందులో ఏడుగురిలో ఐదుగురు గంజాయి తీసుకున్నట్టు, ఒక్కరు మెథాంఫెటామైన్, మరొకరు బెంజోడయాజెపైన్ తీసుకున్నట్టు బయటపడింది. వీరిలో ఒక్కరు మినహా మిగితా ఆరుగురికి నోటీసులు ఇచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
డిప్రెషన్లో వేసుకున్న ట్యాబ్లెట్స్తో మొదట పాజిటివ్
హైదరాబాద్కు చెందిన రిత్విక్ అనే యువకుడికి కల్లు తాగే అలవాటు ఉంది. కల్లు తాగడంతో పాటు డిప్రెషన్ తగ్గేందుకు బెంజోడియాజెపైన్ అనే మందు వాడుతున్నాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. కాగా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో గతంలో ఎలాంటి డ్రగ్ హిస్టరీ లేదని పోలీసులు గుర్తించారు. వీరిలో మహారాష్ట్రకి చెందిన మొబైల్ షాప్ ఓనర్ రితీష్, ఏపీకి చెందిన మహిళా ఐఏఎస్ అధికారి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆకెళ్ల హరిత్ సారంగ్, వివిధ వ్యాపారాలు చేస్తున్న యువకులు పట్టుబడ్డారు. వీరంతా ఒక్కొకరు ఒక్కో ప్రదేశంలో డ్రగ్స్, గంజాయిని సేవించి పబ్కు వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గంజాయి పాజిటీవ్ వచ్చిన వారు
పేరు వృత్తి
మోనిష్ ఉమేశ్ వ్యాపారం
ప్రుద్వీరాజ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్
అభిషేక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్
రిషబ్ వ్యాపారం
హరిత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (ఐఏఎస్ కుమారుడు)
జ్యోతిరాదిత్య సాఫ్ట్వేర్ ఇంజినీర్
రితేశ్ మొబైల్ షాప్ నిర్వాహకుడు (మెథాంఫెటమైన్ పాజిటీవ్)
