- పవర్ ప్లాంట్ నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణా బోర్డుకు లెటర్
- ఇప్పటికే వందల టీఎంసీలు వాడుకున్న ఏపీ.. రైట్ పవర్ ప్లాంట్లో కరెంటు ఉత్పత్తి
- పోతిరెడ్డిపాడు నుంచి మరిన్ని నీళ్లు తీసుకెళ్లేందుకు స్కెచ్
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ ప్రొటోకాల్పై ఏపీ మళ్లీ పాత పాట పాడింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకొనేందుకు వీలుగా.. శ్రీశైలం ఎడమగట్టు పవర్ హౌస్ నుంచి నీటి వినియోగం ఆపాలని కృష్ణాబోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి బుధవారం కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేకు లెటర్ రాశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేకున్నా.. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్లాంట్లో కరెంట్ ఉత్పత్తి చేస్తూ, సాగర్కు నీటిని విడుదల చేస్తోందని కంప్లైంట్ చేశారు. ఈనెల 12న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో ఆగిపోయిందని.. ఆరోజున రిజర్వాయర్లో 206.97 టీఎంసీల నీటి నిల్వ ఉండేదని వివరించారు. తెలంగాణ సర్కారు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా వాడుతోందని పేర్కొన్నారు. రాయలసీమతో పాటు చెన్నై తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా.. తెలంగాణ పవర్ హౌస్ నుంచి నీటి విడుదల ఆపాలన్నారు. కృష్ణాబోర్డు వెంటనే జోక్యం చేసుకుని కరెంట్ ఉత్పత్తి ఆపేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని కోరారు.
అడ్డగోలుగా నీళ్లు వాడుకున్నా..
శ్రీశైలంలో బుధవారం నాటికి 197.46 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీ ఇప్పటికే 347 టీఎంసీల నీళ్లను తరలించుకుంది. ఇందులో ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే 121 టీఎంసీలు తరలించుకుపోయింది. మన రాష్ట్రం మాత్రం మొత్తం కృష్ణా బేసిన్లో కలిపి కూడా 97 టీఎంసీలనే వాడుకుంది. సీజన్ సగం కూడా పూర్తిగాకముందే పెద్ద ఎత్తున నీటిని వాడేసుకున్న ఏపీ.. ఇప్పుడు తెలంగాణను మాత్రం తీసుకోనివ్వడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి మరిన్ని నీళ్లను తరలించుకుపోవడం కోసం శ్రీశైలం లెఫ్ట్ ప్లాంట్లో నీటి విడుదల ఆపాలనే డిమాండ్ మొదలుపెట్టింది.
నడుస్తున్నది రెండు యూనిట్లే..
శ్రీశైలం లెఫ్ట్ పవర్ ప్లాంట్లో ఆగస్టు 20న అగ్ని ప్రమాదం జరగడంతో మూడు నెలల పాటు కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్లోని ఆరు యూనిట్లకుగాను.. అక్టోబర్ 20వ తేదీ రెండు యూనిట్లను మాత్రమే పునరుద్ధరించారు. కొన్ని రోజులు ట్రయల్ రన్ చేసి.. నవంబర్ రెండో వారం నుంచి కరెంటు ఉత్పత్తి ప్రారంభించారు. మరోవైపు ఏపీ మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు పోటెత్తిన నాలుగైదు నెలలుగా రైట్ పవర్ ప్లాంట్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకుంటూనే వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ కేవలం రెండు యూనిట్లలోనే కరెంటు ఉత్పత్తి చేస్తున్నా అక్కసు వెళ్లగక్కుతోంది. ఇక కల్వకుర్తి ఫస్ట్ పంపుహౌస్ మునిగిపోవడంతో వరదల టైంలో తెలంగాణ నీళ్లు తీసుకోలేకపోయింది. ఇలా తెలంగాణ రెండు రకాలుగా నష్టపోయినా.. ఆ విషయాన్ని పక్కనపెట్టి పవర్ జనరేషన్ ఆపాలని ఏపీ కోరుతుండటం గమనార్హం.