
లుసానె: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)కు వీలైనంత త్వరగా సీఈవోను లేదా సెక్రటరీ జనరల్ను నియమించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) కోరింది. సీఈవో నియామకంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)లో నెలకొన్న వివాదాలను కూడా పరిష్కరించాలని సూచించింది. అవసరమైతే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) గైడ్లైన్స్ ప్రకారం వెళ్లాలని చెప్పింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో ఈ రెండు అంశాలపై చర్చించిన సభ్యులు ఘాటైన వ్యాఖ్యలతో ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘ఐవోఏ రాజ్యాంగం ప్రకారం పరిస్థితులను చక్కదిద్దడానికి సీఈవోను నియమించాలి. దురదృష్టవశాత్తూ ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. చాలా రోజుల నుంచి ఐవోసీ ఈ విషయాన్నే చెబుతున్నది. స్పోర్ట్స్ ఫెడరేషన్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్తో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి’ అని ఐవోసీ పేర్కొంది.