పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లు ఆమోదం పొందింది. గతేడాది మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపట్టారు.వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు. చివరికి ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య, మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది.
రాజ్యసభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు కాంగ్రెస్ సహా విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉపసంహరణ బిల్లును పాస్ చేసింది రాజ్య సభ. మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేసింది.