సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆంధ్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్దమైంది. సంక్రాంతికి 6 వేల 795 స్పెషల్ బస్సులు నడపనున్నట్లుగా వెల్లడించింది. 2024 జనవరి 6 నుంచి 18 వరకూ ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఈ స్పెషల్ బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు పెంచబోమని.. సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నట్లుగా వెల్లడించింది. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది.
మరోవైపు తెలంగాణలో కూడా సంక్రాంతి పండగకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4 వేల 484 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. 2024 జవనరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ బస్సులు నడవనున్నట్లుగా ఆర్టీసీ స్పష్టం చేసింది. బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని.. సాధారణ ఛార్జీల ఉంటాయని తెలిపింది. మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత ప్రయాణం.. ఈ బస్సులకూ కూడా వర్తించేలా టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.