ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే ఆలోచనను విరమించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించడంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదరరావు స్పష్టం చేశారు.
కార్మికుల డిమాండ్లపై ఈ నెల 10వ సీఎంని కలసి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని దామోదరరావు అన్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుండడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో జరగాల్సిన సమ్మె సన్నాహక సభలను విరమించుకుంటున్నట్లు మిగతా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ చర్చల్లో యాజమాన్యం తరఫున ఆర్టీసీ ఈడీలు కూడా పాల్గొన్నారు.