
Gold Buying: గడచిన కొన్ని నెలలుగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒకానొక దశలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.లక్ష మార్కును చేరుకుంది. దీంతో సామాన్యులు బంగారం అనే మాట పలకాలన్నా భయపడ్డారు. అంతర్జాతీయంగా పరిస్థితులు క్రమంగా చల్లబడుతున్న వేళ తిరిగి గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారు నాణాలు, ఆభరణాల షాపింగ్ మెుదలుపెడుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని గమనించాల్సిన కీలకమైన అంశాలు ఉన్నాయి.
క్రెడిట్ కార్డులను ఉపయోగించి గోల్డ్ కొనేవారు అందులో ఉండే చార్జీలు, సవాళ్ల గురించి కూడా ముందుగా తెలుసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి క్రెడిట్ కార్డులు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల కోసం రూపొందించబడ్డాయని సీఏ ప్రణీత్ జైన్ పేర్కొన్నారు. వీటికి చెల్లింపులు సకాలంలో మిస్ అయితే 3 నుంచి 4 రూపాయల వడ్డీని సదరు సంస్థలు ఛార్జ్ చేస్తాయి. వీటిలో జీఎస్టీ ఛార్జీలు, లేట్ పేమెంట్ ఫీజులు వంటివి ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్ డబ్బుతో పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలని జైన్ పేర్కొన్నారు.
బంగారాన్ని క్రెడిట్ కార్డుల్లో కొన్నప్పుడు దానిని ఈఎంఐగా మార్చుకునేందుకు సదరు సంస్థలు అనుమతించవని గుర్తుంచుకోండి. ఎందుకంటే దేశంలో గోల్డ్ నిల్వలను రక్షించే క్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బంగారానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లను ఈఎంఐలు మార్చటాన్ని 2013 నుంచి నిరోధించింది. అలాగే బ్యాంకు బ్రాంచీల్లో కూడా ఇలాంటి చెల్లింపులు చేయకుండా కార్డు వినియోగాన్ని అనుమతించటం లేదు. పైగా ఈ మెుత్తం చెల్లింపులను పూర్తిగా చేయకుండా మినిమం డ్యూ కడితే వార్షికంగా 36 శాతం వరకు వడ్డీని దానిపై వసూలు చేస్తాయి.
ఇక ఛార్జీల విషయానికి వస్తే బంగారాన్ని క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేయటంపై మర్చంట్ ఛార్జీలు అత్యధికంగా 3.5 శాతం వరకు వసూలు చేయబడుతున్నాయి. ఒకవేళ విదేశీ సంస్థ నుంచి గోల్డ్ కొన్నప్పుడు ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా భరించాల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో అనేక క్రెడిట్ కార్డ్ సంస్థలు సెలెక్టెడ్ సంస్థల నుంచి కొనుగోలు చేసే బంగారు ట్రాన్సాక్షన్లపై 3 శాతం నుంచి 5 శాతం వరకు క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ అందిస్తున్నాయి. చాలా మంది ప్రస్తుతం బంగారం కొనుగోలుకు భారీగా డబ్బు క్యారీ చేయటం కంటే కార్డ్ పేమెంట్ ఉత్తమంగా భావిస్తున్నారు. కేంద్రం సైతం పెద్ద మెుత్తం చెల్లింపులను డిజిటల్ రూపంలో చేయాలని సూచిస్తోంది.