గ్యాంగ్టక్: సిక్కింలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. దాంతో రోడ్లపై వాహనాల్లో చిక్కుకుపోయిన వేలాది టూరిస్టులను కాపాడేందుకు అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సిక్కిం జిల్లాలోని చుంగ్తాంగ్ వద్ద చిక్కుకుపోయిన మరో 300 మంది టూరిస్టులను దేశ సైన్యానికి చెందిన స్ట్రైకింగ్ లయన్ డివిజన్, త్రిశక్తి కార్ప్స్ దళాలు రక్షించాయని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ సోమవారం తెలిపారు.
బాధితులందరూ తాత్కాలిక వంతెనను దాటి గ్యాంగ్టక్ వైపు వెళ్లేందుకు జవాన్లు సహాయపడ్డారని వెల్లడించారు. పర్యాటకులను సేఫ్ ప్లేస్కు తరలించి వారికి వసతి కల్పించినట్లు తెలిపారు. ఉత్తర సిక్కిం జిల్లా కలెక్టర్ హేమ్ కుమార్ చెత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు.