భార్యను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న వస్త్ర వ్యాపారి

 భార్యను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న వస్త్ర వ్యాపారి

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తుపాకీ గాయాలతో ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సూసైడ్ నోట్ లో వ్యాపారవేత్త అయిన సంజయ్ సేథ్ ..తాను బాగేశ్వర్ ధామ్ భక్తుడినని పేర్కొన్నాడు. "గురూజీ, నన్ను క్షమించు. నాకు మరో జన్మ లభిస్తే, నేను మీ భక్తుడిగా మాత్రమేఉంటాను" అంటూ ఎమోషనల్ కోట్ ను రాశాడు. ఈ సంఘటనకు ముందు సంజయ్ సేథ్ ఒక వీడియోను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో సంజయ్ ఏడుస్తూ కనిపించాడు. దాంతో పాటు తన నుండి అప్పుగా తీసుకున్న వాళ్లు డబ్బును తిరిగి చెల్లించలేదని, వారి పేర్లను కూడా చెప్పాడు. "దయచేసి నా కూతురు పెళ్లి కోసం అయినా డబ్బును తిరిగి ఇవ్వండి. ఆమె పెళ్లిని ₹ 50 లక్షల నుండి రూ.1 కోటితో జరిపించండి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తన కుమార్తె ఖాతాలో రూ.29 లక్షల వరకు ఉన్నాయని చెప్పాడు. తన భార్య, తాను ఇద్దరూ బతకలేక వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మై చిల్ర్డెన్ నన్ను క్షమించండి అంటూ వీడియోలో ఎమోషనల్ అయ్యాడు.

సంజయ్ సేథ్ తన భార్య మీనుతో కలిసి నగరం నడిబొడ్డున ఉన్న కిషోర్‌గంజ్ ప్రాంతంలో నివసించేవాడు. సంఘటన జరిగిన సమయంలో సంజయ్‌, మీను ఇద్దరూ ఇంటి రెండో అంతస్తులోని గదిలో ఉన్నారు. కాల్పుల శబ్దం విని ఇతర కుటుంబ సభ్యులు పైకి చేరుకోగా... అప్పటికే  సంజయ్ భార్య మృతి చెందగా, సంజయ్ మాత్రం ప్రాణాలతోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతడు కూడా మృతి చెందినట్టు సమాచారం. అయితే ఈ కేసు పూర్తిగా గృహ వివాదానికి సంబంధించినదిగా కనిపిస్తోందని పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్‌రాజ్ మీనా అన్నారు. "ఇది చాలా బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని... ప్రస్తుతం బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదని చెప్పారు. ఆ గదిలో దంపతులు మాత్రమే ఉన్నారన్న సూపరింటెండెంట్.. తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.