న్యూ ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లకు, అన్ని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలకు ఆదేశాలిచ్చింది. శాంతి భద్రతలను కాపాడేందుకు తమ సిబ్బందిని మాగ్జిమమ్ ఎలర్ట్ గా ఉంచాలని స్పష్టంగా పేర్కొంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో శాంతి, మత సామరస్యం కొనసాగించాలని కోరింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. జమ్మూకాశ్మీర్ ప్రజలు, స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజల్ని రెచ్చగెట్టేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలను ఆదేశించింది.
జమ్మూలో భారీగా ఆర్మీ బలగాలు
జమ్మూ: ముందుజాగ్రత్త చర్యగా కేంద్రం అదనపు ఆర్మీ బలగాలను జమ్మూలోకి దించింది. సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినట్టు అధికారులు సోమవారం చెప్పారు. శాంతిభద్రతలను కాపాడేందుకు టైగర్ డివిజన్ ఆర్మీ బెటాలియన్.. సివిల్ అధికారులకు సాయపడుతుందన్నారు. జమ్మూ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని వారు తెలిపారు. పోలీసులకు సీఆర్ఫీఎఫ్ అధికారులు సాయపడుతున్నారు.జమ్మూలోని రోడ్లన్నీ జనంలేక వెలవెలబోతున్నాయి. షాపులు మూతపడ్డాయి. అత్యవసరమైతేనే జనాన్ని రోడ్లమీదకు రానిస్తున్నారు. ప్రతి ఒక్కర్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే జమ్మూ అంతటా మొబైల్, ఇంటర్నెట్ సర్వీసుల్ని ఆపేశారు.
ఢిల్లీ మెట్రోలో హై సెక్యూరిటీ
దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో సర్వీసుల్లో సెక్యూరిటీ పెంచారు. విస్తృతంగా తనిఖీలు చేసిన మీదటే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఢిల్లీ మెట్రో నెట్వర్క్ లో రెడ్ ఎలర్ట్ విధించినట్లు సోమవారం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్విట్టర్లో పేర్కొంది. సెక్యూరిటీ కోసం సీఐఎస్ఎఫ్, తీవ్రవాద నిరోధక బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.