- లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: కేజ్రీవాల్
- ఆప్ హెడ్ ఆఫీస్లో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం
న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ‘‘ఢిల్లీ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే.. మీ అభివృద్ధికి ఏ స్కీమ్ తీసుకొచ్చినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారు. ఓ సాధారణ వ్యక్తికి ఢిల్లీ అధికారం కట్టబెట్టినందుకు ఇదంతా చేస్తున్నారు. మోహల్లా క్లినిక్లను బుల్డోజర్లతో కూల్చేశారు’’అని కేజ్రీవాల్ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికలకు ఆప్ తన ప్రచారాన్ని శుక్రవారం డీడీయూ మార్గ్లోని పార్టీ హెడ్ ఆఫీస్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
‘‘పార్లమెంటులోనూ కేజ్రీవాల్ ఉంటే.. ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుంది’’అనేది తమ నినాదం అని చెప్పారు. ‘‘ఆప్ తరఫున బరిలోకి దిగనున్న ఏడుగురు అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి పార్లమెంట్కు పంపించాలి. ఇంటింటికీ రేషన్, వైద్య పరీక్షలు, మెడిసిన్స్ పంపిణీ చేసే స్కీమ్ను కేంద్రం ఆపేసింది. ఆప్ తీసుకొచ్చిన స్కీమ్లు, కేంద్రం అడ్డుకుంటున్న తీరును పార్టీ కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’అని సూచించారు. ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన పాంప్లెట్లను ఆయన ఆవిష్కరించారు. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని మొత్తం 13 ఎంపీ స్థానాలను ఆప్ కైవసం చేసుకుంటుందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు.