న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ఇందుకు తన అరెస్టే నిదర్శనమని లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్అన్నారు. ఈ కేసులో ఈడీ అతిగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టుకు చెప్పారు. లోక్సభ ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేయడం ద్వారా ఏకపక్షంగా నడుచుకున్నదని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు ఈడీని సమాధానం కోరింది. ఈడీ అఫిడవిట్ దాఖలు చేయగా, దానిపై శనివారం కేజ్రీవాల్ స్పందించారు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు.
ఎన్నికల వేళ అణచివేసేందుకు కుట్ర
లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని, మనీలాండరింగ్ యాక్ట్ను దుర్వినియోగం చేస్తున్నదని కేజ్రీవాల్ తెలిపారు. లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్విడుదల కాకముందే.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తనను అరెస్ట్ చేసిన తీరు ఈడీ ఏకపక్ష వైఖరికి అద్దంపడుతోందన్నారు. దర్యాప్తు సంస్థను అడ్డంపెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో పైచేయి సాధిస్తోందని ఆరోపించారు.
అలాగే, దర్యాప్తు సమయంలో ఈడీ ప్రవర్తన చట్టబద్ధమైన ప్రక్రియను విస్మరించిందని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి తప్పుచేయలేదని సహనిందుతులు చెప్పిన విషయాన్ని ఈడీ అధికారులు దాచిపెట్టారని అన్నారు. తాను తప్పుచేసినట్టు వారి వద్ద ఒక్క ఆధారంకూడా లేదని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కేజ్రీవాల్ అఫిడవిట్లో పేర్కొన్నారు.