నామినేటెడ్​ పోస్టుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు

నామినేటెడ్​ పోస్టుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు
  • పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న హై కమాండ్
  •     కొత్త, పాత నేతల మధ్య పోటీ
  •     ఎంపిక ప్రక్రియపై ఎమ్మెల్యేల కసరత్తు షురూ

నాగర్​ కర్నూల్,​ వెలుగు: వ్యవసాయ మార్కెట్​ కమిటీ పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం త్వరలో కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు నిర్ణయించడంతో ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. నామినేటెడ్​ పోస్టుల్లో పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించడంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో జోష్​ పెరిగింది. మొదటి నుంచి కాంగ్రెస్​ పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలతో పాటు పార్టీ మారిన అగ్ర నేతలు, వారి అనుచరుల మధ్య పోటీ నెలకొంది. నాగర్​కర్నూల్​ జిల్లాలో నాగర్​ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, ఆమనగల్లు మార్కెట్​ యార్డులు ఉన్నాయి. 

ఎవరికి వారే ప్రయత్నాలు..

నాగర్​ కర్నూల్​ మార్కెట్​ చైర్మన్​ పోస్టు కోసం పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెల్కపల్లి మండల లీడర్లు​టీం వర్క్​ చేశారు. ఈ సారి తెల్కపల్లి మండలానికి చెందిన లీడర్​కు చైర్మన్ గా అవకాశం ఇస్తారని అంటున్నారు. బిజినేపల్లి మండల సీనియర్​ నాయకుడు కూచుకుళ్ల సుహాసన్​రెడ్డి, మాజీ సర్పంచ్​ తిరుపతయ్య, మాజీ ఎంపీపీ కోటయ్య, నర్సింహ్మారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. కొల్లాపూర్​ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఒకటే నామినేటెడ్​ పోస్ట్​ ఉండడంతో దానికి ఫుల్​ డిమాండ్​ ఏర్పడింది. మార్కెట్​ చైర్మన్​ రేసులో ​సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు రంగినేని జగదీశ్వరుడు(జగ్గుసార్), రాము యాదవ్, నర్సింహారావు, బిచ్చారావు పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీని వీడకుండా కొనసాగుతున్న నాయకులతో పాటు మంత్రి జూపల్లిని నమ్ముకున్న లీడర్లు ఉన్నారు. చివరి నిమిషంలో తెరపైకి కొత్త పేర్లు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అచ్చంపేటలో బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు గోపాల్​రెడ్డి పేరు ముందువరుసలో ఉంది.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూరు మండలాలకు చెందిన వారికే మార్కెట్​ చైర్మన్లుగా అవకాశం  లభించింది. అమ్రాబాద్,​ పదర, లింగాల మండలాల లీడర్లకు అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎటు వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కల్వకుర్తి మార్కెట్​ చైర్మన్​  రేసులో చాలా మంది లీడర్లున్నారు. వీరిలో బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు విజయ్​కుమార్​రెడ్డి, పంజుగుల అశోక్​ రెడ్డి, చింతల రమణారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

ఈ నెల 30తో సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో, వెల్డండ సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి కూడా రేస్​లోకి వస్తారని సమాచారం. వంగూరు, ఊర్కొండ మండలాల లీడర్లు కూడా ఈ పోస్టుకు పోటీ పడుతున్నారు. వైస్​ చైర్మన్​ పోస్ట్​ వంగూరు లేదా ఊర్కొండ మండలాలకు ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఈ సారి అది కొనసాగుతుందా లేదా అనే చర్చ నడుస్తోంది. ఆమనగల్లు మార్కెట్​ చైర్మన్​ రేసులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​రెడ్డి వర్గీయులు పోటీపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మార్కెట్​ చైర్మన్ల ఎంపిక వ్యవహారం అగ్రనాయకులకు సవాలేనని అంటున్నారు. అయితే ఈ పోస్టుల కోసం పార్టీ కోసం పని చేసిన నేతలు తమ పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఎంపికపై కసరత్తు షురూ..

నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్​ మార్కెట్​ కమిటీల ఎంపికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, డా.కూచుకుళ్ల రాజేశ్​రెడ్డిలకు స్పష్టత ఉంది. నాగర్​ కర్నూల్​ చైర్మన్​ ఎంపికలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కల్వకుర్తి, ఆమనగల్లు మార్కెట్​ కమిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిన్న సైజు కసరత్తు చేయాల్సి ఉంటుంది.  రెండు కమిటీల ఎంపిక, చైర్మన్లుగా ఎవరిని నియమించాలనే దానిపై కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు​ వంశీచంద్​రెడ్డి సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇద్దరు నేతలు ఆమనగల్లు, కల్వకుర్తి మార్కెట్​ కమిటీలను పంచుకునే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.