కొత్తగూడెం సీపీఐకే..బరిలో ఆ పార్టీ స్టేట్​ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం సీపీఐకే..బరిలో ఆ పార్టీ స్టేట్​ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు
  •     రేబల్​గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం సీటు ‘చే’ జారింది. కాంగ్రెస్, సీపీఐల పొత్తులో భాగంగా ఈ సీటు సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ స్టేట్​సెక్రటరీ కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్​ ఆశావహులు రెబల్​గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

మొదటి నుంచి హాట్​టాపిక్​గా..

కాంగ్రెస్, సీపీఐల పొత్తుల కారణంగా రాష్ట్రంలోనే కొత్తగూడెం సీటు హాట్​టాపిక్​గా మారింది. మొదట్లో ఇక్కడి నుంచి మాజీ ఎంపీ, టీపీసీపీ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించారు. నియోజకవర్గంలోని చుంచుపల్లిలో పొంగులేటి క్యాంప్​ ఆఫీస్​కూడా ఓపెన్​ చేశారు. కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూనే అత్యధిక సమయం కొత్తగూడెం నియోజకవర్గంలోనే కేటాయించారు.

కానీ పొంగులేటి పాలేరు నుంచి పోటీలో ఉంటారని తెలిసిన తర్వాత కాంగ్రెస్​ ఆశావహులు టికెట్​ కోసం విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు పార్టీల పొత్తులపై పది రోజులుగా ఎటూ తేల్చకపోవడంతో ఇటీవల కాంగ్రెస్​ ఆశావహులు ఢిల్లీ స్థాయిలో టికెట్​కోసం పైరవీలు చేసిన దాఖలాలున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు మరో మూడు రోజులు గడువున్న చివరిక్షణంలో పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్​ ఆశావహులకు నిరాశే మిగిలింది.

టికెట్​ కోసం మొదటి నుంచి ఆశపడిన టీసీపీఐ జనరల్​ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ, టీపీసీసీ మెంబర్​నాగ సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రెబల్​గా నామినేషన్లు వేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్​ తరుపున మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​ పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఆశించారు. ఏదేమైనా కొత్తగూడెం సీటుపై క్లారిటీ రావడంతో సీపీఐ తరుపున ఆ పార్టీ స్టేట్​ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు ఈనెల 8న నామినేషన్ వేయనున్నారు. 

ఆ రెండు డిక్లేర్​.. 

జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు టికెట్లపై కాంగ్రెస్​ హైకమాండ్ ఎట్టకేలకు సోమవారం రాత్రి క్యాండిడేట్లను డిక్లేర్​ చేసింది. ఇల్లందు అభ్యర్థిగా బాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యను ప్రకటించింది.  అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణను ఫైనల్​ చేసింది.