ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ -ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అధికారిక బంగ్లాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపుల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అసదుద్దీన్ ఓవైసీకి ఎలాంటి గాయాలు కాలేదు.
ఢిల్లీలోని తన అధికారిక ఇంటిపై కొందరు దాడి చేశారని పోలీసులకు అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఓవైసీ ఇంటి తలుపుల రెండు అద్దాలు పగలగొట్టి గుర్తించారు. అయితే పగిలిన అద్దాల చుట్టూ ఎలాంటి రాయి లేదా మరే వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయితే అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఢిల్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగులు దాడి చేశారు. 2014 తర్వాత తన ఇంటిపైదాడి చేయడం ఇది నాలుగోసారి అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.