IPL 2025: వీళ్ల బాధ బాధ కాదు.. స్టేడియంలో బోరుబోరున ఏడ్చిన నెహ్రా కొడుకు, గిల్ చెల్లి

IPL 2025: వీళ్ల బాధ బాధ కాదు.. స్టేడియంలో బోరుబోరున ఏడ్చిన నెహ్రా కొడుకు, గిల్ చెల్లి

ఐపీఎల్ 18వ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడిన గుజరాత్ టైటాన్స్ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచులో ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. పంజాబ్‎లోని ముల్లాన్‎పూర్ వేదికగా శుక్రవారం (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‎ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హార్ధిక్ సేన.. 20 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది.

లీగ్ మొదటి నుంచి అధిపత్యం చెలాయించిన గుజరాత్ టైటాన్స్ డూ ఆర్ డై లాంటి ఎలిమినేటర్ మ్యాచులో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో జీటీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. జీటీ అభిమానులే కాదు.. గుజరాత్ జట్టులోని ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఈ ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓటమి అనంతరం గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కుమారుడు స్టాండ్స్‎లో బోరున విలపించాడు. పక్కన ఉన్నవారు ఓదార్చడానికి ప్రయత్నించిన కూడా కన్నీళ్లు ఆపులేకపోయాడు. తండ్రి జట్టు ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చాడు.

శుభ్‌మాన్ గిల్ సోదరి షహనీల్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. జీటీ ఓటమి తర్వాత నెహ్రా కుమారుడు, గిల్ సోదరి ఎమోషనలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ వీడియోలు చూసిన జీటీ, క్రికెట్ ఫ్యాన్స్.. ‘పాపం వీళ్ల బాధ బాధ కాదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తానికి గుజరాత్ ఓటమి అనంతరం స్టాండ్స్‌లో భావోద్వేగ వాతావరణం కనిపించింది.