
- మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు
- ప్రభుత్వాన్ని నడపడంలో ఫెయిల్ అయ్యారని విమర్శలు
జైపూర్: ప్రజలకు మాయమాటలు చెప్పి రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ, ప్రభుత్వాన్ని నడపడంలో మాత్రం ఫెయిల్ అయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సీఎం అశోక్ గెహ్లాట్ ను పదవిలోంచి దించేందుకు ఆయన సొంత పార్టీలోని సగం మంది నేతలు నాలుగేండ్లుగా ప్రయత్నిస్తుంటే.. గెహ్లాట్ తన కుర్చీ కాపాడుకునే పనిలో బిజీగా ఉండిపోయారని అన్నారు. రాజస్థాన్ లోని చిత్తోర్గఢ్లో సోమవారం నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో ఎన్నో విభేదాలున్నాయి కానీ, దోపిడీలో మాత్రం వాళ్లంతా ఏకాభిప్రాయంతో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగేండ్లలో రాష్ట్రాన్ని నాశనం పట్టించిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండకూడదని అన్నారు. మహిళలపై దాడులకు సంబంధించిన నేరాలు ఎక్కువగా రాజస్థాన్లోనే నమోదవడం పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, దళితులు, వెనుకబడిన వారిపై అఘాయిత్యాల కేసుల్లో రాష్ట్రం అపఖ్యాతి పాలవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పేపర్ లీక్ మాఫియాకు చెక్ పడుతుందని చెప్పారు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేసిన ద్రోహానికి తెరపడుతుందన్నారు. అవినీతికి పాల్పడి పేదల సొమ్ము దోచుకున్నోళ్లపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించారు.
ఓడిపోతానని గెహ్లాటే ఒప్పుకున్నడు
ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కలిగినప్పుడల్లా కాంగ్రెస్ హామీల ప్రకటనలు చేస్తుందని, రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఇప్పడలాంటి ప్రయత్నాలే చేస్తోందని మోదీ అన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ స్టార్టయింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను రద్దు చేయొద్దని సీఎం అశోక్ గెహ్లాటే నన్ను కోరారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని ఆయనే ఒప్పుకున్నారు” అని ప్రధాని అన్నారు. తాము మాత్రం వాటిలో దేనినీ నిలిపివేయబోమని హామీ ఇచ్చామన్నారు. ర్యాలీకి ముందు రాజస్థాన్లో రూ.7,200 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.
దేశాన్ని విభజించాలని చూస్తున్నరు
ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని కులం పేరిట విభజించాలని చూస్తున్నాయని మోదీ ఫైర్ అయ్యారు. బీహార్ లో కులగణన డేటా ప్రకటన నేపథ్యంలో దేశమంతా కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై ప్రధాని ఈ మేరకు స్పందించారు.