ఆసియా కప్ 2022 షెడ్యూల్ రిలీజైంది. దుబాయ్ వేదికగా టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా టోర్నీ మ్యాచ్ల వివరాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ 2022 జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లు రాత్రి 7.30 గంటల నుంచి ప్రసారం అవుతాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాక్ తో ఆడనుంది. ఆగస్టు 28న ఈ మ్యాచ్ జరగబోతుంది. సెకండ్ మ్యాచ్ను క్వాలిఫయర్ టీమ్ తో 31న జరగనుంది. సెప్టెంబర్ 3న సూపర్ -4 మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ 2022లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లతో పాటు..మరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్లో తలపడతాయి. ఆసియా కప్ 2022 టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా...ఆర్థిక సంక్షోభం, ఇతర రాజకీయా కారణాలతో టోర్నీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ యూఏఈకి తరలించింది.
ఆసియాకప్ చివరగా 2018లో జరిగింది. ఆ టోర్నీలో భారతే విజేతగా నిలిచింది. 2016లోనూ టీమిండియానే టైటిల్ను దక్కించుకుంది. దీంతో తాజా టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మెగా ఈవెంట్లో భారత్కు మంచి రికార్డుంది. 1984లో తొలిసారి ఆసియా కప్ ను నిర్వహించగా..టీమిండియా అత్యధిక సార్లు (7 ) విజేతగా నిలవడం విశేషం. ఆ తర్వాత శ్రీలంక ఐదు సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి.