పాకిస్తాన్​కు షాక్‌‌‌‌‌‌‌‌..  శ్రీలంకలో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌!

పాకిస్తాన్​కు షాక్‌‌‌‌‌‌‌‌..  శ్రీలంకలో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌!

    
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డుకు ఆసియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (ఏసీసీ) షాకిచ్చింది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2–17 తేదీల మధ్య జరగాల్సిన ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను ఆ దేశం నుంచి తరలించాలని డిసైడింది. ఆరు జట్లు పోటీ పడే ఈ టోర్నీ శ్రీలంకలో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీ కోసం టీమిండియాను పాక్‌‌‌‌‌‌‌‌ పంపేందుకు బీసీసీఐ ముందు నుంచి ఒప్పుకోవడం లేదు. ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు యూఏఈలో, మిగతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు తమ దేశంలో నిర్వహించేలా పాక్‌‌‌‌‌‌‌‌ బోర్డు ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్'ను ఏసీసీ సభ్య దేశాలు తిరస్కరించాయి. దాంతో, ఈ టోర్నీని పాక్‌‌‌‌‌‌‌‌  నుంచి తరలించాలని ఏసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు నెలలో యూఏఈలో బాగా తేమతో కూడిన పరిస్థితులు ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉన్నందున  ఈ టోర్నీని శ్రీలంకకు షిఫ్ట్ చేసే చాన్సుంది.

‘హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌కు మద్దతు కోసం పీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నజామ్ సేథీ ఆదివారం దుబాయ్‌‌‌‌‌‌‌‌ వచ్చారు. కానీ, ఆయనకు ఎవ్వరూ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు.   శ్రీలంక బీసీసీఐతోనే ఉండగా, ఇప్పుడు బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌  పీసీబీ ఆలోచనను వ్యతిరేకించింది. ఏసీసీ కూడా హైబ్రిడ్ మోడల్ ఆమోదయోగ్యం కాదని, బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను పెంచలేమని చెప్పింది. పాక్‌‌‌‌‌‌‌‌, ఇండియా ఒకే గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఉంటే ఆ గ్రూప్‌‌‌‌‌‌‌‌లోని మూడో జట్టు దుబాయ్‌‌‌‌‌‌‌‌, పాక్‌‌‌‌‌‌‌‌లోని ఓ సిటీ మధ్య చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్రాడ్‌‌‌‌‌‌‌‌ కాస్టర్‌‌‌‌‌‌‌‌ కూడా రెండు దేశాలకు  ప్రత్యేక యూనిట్లను పంపడానికి ఒప్పుకోదు.  అదే  శ్రీలంకలో టోర్నీ నిర్వహిస్తే యూఏఈ మాదిరిగా స్టేడియాల మధ్య  ఇంటర్‌‌‌‌‌‌‌‌ సిటీ విమానాల్లో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అందుకే టోర్నీని పాక్‌‌‌‌‌‌‌‌ నుంచి తరలించాలని నిర్ణయించారు’ అని ఏసీసీ అధికారి ఒకరు చెప్పారు.   ఏసీసీ చైర్మన్ జై షా  ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. తమ దేశం నుంచి తరలించిన నేపథ్యంలో ఈ టోర్నీలో పాక్‌‌‌‌‌‌‌‌ పాల్గొంటుందా? వన్డే వరల్డ్​ కప్​ కోసం ఇండియా వస్తుందా? అన్నది సస్పెన్స్ గా మారింది.