
- ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ రుణాలు
న్యూఢిల్లీ: ఇండియాలోని పట్టణ ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీపీ) రానున్న ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్ల (రూ.86 వేల కోట్ల) ను అప్పుగా ఇవ్వనుంది. ఇందులో సావరిన్ లోన్స్ (ప్రభుత్వ లోన్స్), ప్రైవేట్ సెక్టర్ ఫైనాన్సింగ్, థర్డ్-పార్టీ క్యాపిటల్ ఉన్నాయని ఏడీబీ ప్రెసిడెంట్ మసాటో కందా చెప్పారు. ఇండియాకు చెందిన అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో ఏడీబీ సపోర్ట్ చేస్తుంది. 100 నగరాల్లో గ్రోత్ హబ్స్, క్రియేటివ్ సిటీ రీడెవలప్మెంట్, వాటర్ అండ్ సానిటేషన్ను మెరుగుపరచడానికి ఫండ్స్ ఉపయోగించనున్నారు.
అలానే లాభదాయకమైన ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడానికి, స్టేట్స్, అర్బన్ లోకల్ బాడీస్ కెపాసిటీని మెరుగుపరచడానికి ఏడీబీ 3 మిలియన్ డాలర్ల టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది. 2030 నాటికి ఇండియా టౌన్స్, సిటీలలో 40 శాతం కంటే ఎక్కువ జనాభా ఉంటుందని అంచనా. ఏడీబీ ఇప్పటికే 22 రాష్ట్రాల్లోని 110 సిటీలలో వాటర్ సప్లై, సానిటేషన్, హౌసింగ్, సాలిడ్-వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్కు లోన్లు ఇచ్చింది. దీని యాక్టివ్ అర్బన్ పోర్ట్ఫోలియోలో 5.15 బిలియన్ డాలర్ల విలువైన 27 లోన్స్ ఉన్నాయి.
అర్బన్ ట్రాన్స్పోర్ట్లో, గత దశాబ్దంలో ఏడీబీ 4 బిలియన్ డాలర్లను మెట్రో ప్రాజెక్ట్స్, ఆర్ఆర్టీఎస్ కోసం ఇన్వెస్ట్ చేసింది. ఢిల్లీ–-మీరట్ ఆర్ఆర్టీఎస్, ముంబై మెట్రో, నాగ్పూర్ మెట్రో, చెన్నై మెట్రో, బెంగళూరు మెట్రో ఉన్నాయి. ఏడీబీ 1986లో ఇండియాలో అప్పులు ఇవ్వడం మొదలు పెట్టింది. ఏప్రిల్ 2025 నాటికి, 59.5 బిలియన్ డాలర్ల ప్రభుత్వ లోన్లు, 9.1 బిలియన్ డాలర్ల ప్రభుత్వేతర లోన్లు ఉన్నాయి.