
- పోటీలో తామేనంటూ ఆశావహుల ప్రచారం
- రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోయినా పోటీకి సిద్ధం
- సైలెంట్ మోడ్లో బీఆర్ఎస్
నిజామాబాద్, వెలుగు : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తుండడంతో జిల్లాలోని ప్రధాన పార్టీల లీడర్లు పోటీకి సై అంటున్నారు. మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లపై స్పష్టత రానప్పటికీ పోటీలో తామే ఉండబోతున్నట్లు ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి ఎవరిని నిలబెట్టాలో సర్వే చేసినట్లు ఎంపీ అర్వింద్ ఈనెల 14న ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలు కొందరికి లైన్ క్లియర్ చేయడంతో పార్టీ మీటింగ్లతో వారు బిజీ అయ్యారు. పదేండ్లు తిరుగులేని అధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. నోటిఫికేషన్ వెలువడ్డాక ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్లో కొందరికి గ్రీన్ సిగ్నల్..
స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సర్పంచ్ ఎలక్షన్ మినహా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగనున్నాయి. ఏ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తారన్నదానిపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ తరఫున బోధన్, రూరల్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, అర్బన్ సెగ్మెంట్లలో ఇన్ చార్జీలు గెలుపు గుర్రాలను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొందరికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కానీ రిజర్వేషన్ల అంశం టెన్షన్ పెడుతున్నప్పటికీ మీటింగ్లతో సెగ్మెంట్ లీడర్లు బిజీగా గడుపుతున్నారు. నోటిఫికేషన్ వచ్చాక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు
సిద్ధమవుతున్నారు.
బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ..
ఇటీవల ఎంపీ అర్వింద్ చేసిన ప్రకటనతో బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఎంపీ చేయించిన సర్వేలో ఎవరి పేర్లు ఉన్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీలు, జడ్పీ స్థానంపై ఫోకస్ పెట్టామని, అందుకు తగ్గ సమర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు ఎంపీ ప్రకటించడంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఐదేండ్ల క్రితం స్వల్ప తేడాతో కోల్పోయిన నగర పాలక సంస్థపై ఆయన గురిపెట్టారు.
బీఆర్ఎస్లో నిరుత్సాహం..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిరుత్సాహానికి గురైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులను బరిలో దింపాలని చూస్తోంది. కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు దక్కక ఫిరాయించే వారిపై ఆశలు
పెట్టుకుంది.
నాలుగు నెలలుగా ఎన్నికలపై కసరత్తు..
సర్పంచ్ పదవులు ఫిబ్రవరి 2024 ముగియగా, అదే ఏడాది జూలైలో జడ్పీటీసీ, ఎంపీపీల పదవీ కాలం పూర్తైంది. కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం 2025 జనవరిలో పూర్తైంది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. జిల్లాలో 307 ఎంపీటీసీలు, 31 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నాలుగు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ సెంటర్లతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్లు, పేపర్ బ్యాలెట్ సిద్ధం చేసుకున్నారు.
స్టాఫ్కు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే గవర్నమెంట్ బీసీ గణన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో వాటన్నింటినీ పక్కనపెట్టారు. రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీకి సిద్ధమైన నేతలు మాత్రం అప్పటి నుంచే ఎవరికివారు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. చాన్స్ వస్తుందా ? లేదా అన్న సందిగ్ధంతోనే నిత్యం ప్రజల మధ్య ఉంటూ తమ వర్గాన్ని తయారు చేసుకుంటూ తాజా పరిణామాలతో జోరు పెంచారు.