పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు నవీన్చంద్ర బోరా.. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు సిద్దమయ్యారు. ఏకంగా రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 60 అడుగుల పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు మొత్తం 250 అడుగులు ఉంటుంది. కాంస్య విగ్రహం డిజైన్ కూడా ఖరారైంది.
విగ్రహం మెడ భాగంలో అసోం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్ర్తం) ఉంటుందని నవీన్చంద్ర బోరా వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు. సొంత స్థలంలోనే నవీన్చంద్ర బోరా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2024 జనవరి29వ తేదీ సోమవారం రోజున భూమిపూజ కూడా ప్రారంభించారు. ఈ పూజ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది.
ప్రధాని మోదీకి వీరాభిమాని అయిన నవీన్చంద్ర బోరా ఆయన చేతుల మీదుగా 2016లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆ సమయంలోనే మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సొంత డబ్బులతో, గౌహతిలోని జలుక్బరిలోని బస్టాండ్ సమీపంలోని తన సొంత స్థలంలో సొంత భూమిలోనే దీనిని నిర్మించాలని అనుకున్నట్లుగా నవీన్చంద్ర బోరా తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నానని వెల్లడించారు. మోదీ ప్రపంచంలోనే గ్రేట్ లీడర్ అని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న తాను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లుగా బోరా చెప్పుకొచ్చారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదన్నాడు.