
వికారాబాద్, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారుచేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించగా ఆయన గెస్ట్గా హాజరయ్యారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మంజూరైన రూ.9 కోట్ల 12 లక్షల వడ్డీ మాఫీ చెక్కులను అందజేశారు. కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపుల నిర్వాహణ, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లుల ఏర్పాటు వంటి వ్యాపారాలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించినట్లు తెలిపారు.
ఏడాదికి రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. అనంతరం అనంతగిరి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, ఎం.సుధీర్, సెర్ఫ్ డైరెక్టర్ జాన్సన్, డీఆర్డీవో శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీవో జాఫర్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.