
న్యూఢిల్లీ: మన దేశ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర బుధవారం ప్రారంభం కానుందని నాసా ప్రకటించింది. యాక్సియం–4 మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్తున్నారు. ఈ మిషన్కు ఆయన పైలెట్గా వ్యవహరిస్తున్నారు. ‘‘యాక్సియం–4 మిషన్ ప్రయోగం బుధవారం మధ్యాహ్నం 12:01 (ఇండియన్ టైమ్) జరుగుతుంది.
దీన్ని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తాం. ఈ స్పేస్ క్రాఫ్ట్ను ఫాల్కన్ 9 రాకెట్ మోసుకెళ్తుంది. ఇది గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో డాకింగ్ అవుతుందని అంచనా వేస్తున్నాం” అని నాసా పేర్కొంది. కాగా, ఈ మిషన్ ప్రయోగం మే 29నే జరగాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది.