
- అశ్వారావుపేట మున్సిపాలిటీలో వార్డుల విభజనకు చర్యలు
- ఇటు 60 డివిజన్లు, అటు 22 వార్డులు ఉండేలా ప్లాన్
- ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ కానున్న డివిజన్ల ముసాయిదా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగా ఏర్పాడిన కొత్తగూడెం మున్సిపల్కార్పొరేషన్లో డివిజన్లు, అశ్వారావుపేట మున్సిపాలిటీలో వార్డుల విభజనపై ఆఫీసర్లు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో డివిజన్ల ముసాయిదాను ప్రకటించే అవకాశం ఉంది.
కార్పొరేషన్లో 60 డివిజన్లు..
కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీతో పాటు సుజాతనగర్ మండలంలోని నిమ్మలగూడెం, మంగపేట, నర్సింహసాగర్, నాయకులగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, కొమిటిపల్లి గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. త్వరలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు హడావుడిగా డివిజన్ల విభజనపై కసరత్తు మొదలు పెట్టారు. కార్పొరేషన్లో 60 డివిజన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కార్పొరేషన్లో 1,34,011 మంది ఓటర్లు
కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులకు గానూ 63,750 మంది ఓటర్లు ఉన్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో 61,240 మంది ఓటర్లు ఉన్నారు. సుజాతనగర్ మండలంలోని నిమ్మలగూడెం, మంగపేట, నర్సింహసాగర్, నాయకులగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, కొమిటిపల్లి గ్రామపంచాయతీల్లో కలిపి 9,021 మంది ఓటర్లున్నారు. మొత్తంగా కలిపి కొత్త కార్పొరేషన్లో 1,34,011 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, డివిజన్ల ఏర్పాటు పాల్వంచ నుంచి మొదలైంది. అందరూ మొదటగా కొత్తగూడెం నుంచి డివిజన్ల విభజన ఉంటుందని భావించారు. కాగా నార్త్ టు ఈస్ట్ పద్ధతిలో పాల్వంచ పట్టణం నుంచి డివిజన్ల ప్రక్రియ మొదలవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఒక్కో డివిజన్లో యావరేజ్గా 2,200 మంది ఓటర్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. తక్కువలో 2,010 మంది, ఎక్కువలో 2,456 మంది ఓటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ 35 వేలమంది జనాభా ఉండగా, 20 వేలమంది ఓటర్లున్నారు. ఇక్కడ 22 వార్డులు ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఏ ఏ వార్డులు కలిసి డివిజన్గా మారనున్నాయి, ఏ ఏ బస్తీలు ఏ డివిజన్ పరిధిలోకి వస్తాయనే విషయమై స్థానికుల్లో చర్చ కొనసాగుతోంది.
హడావుడిగా ఆగమాగం..!
కార్పొరేషన్గా గెజిట్ విడుదలైనప్పటికీ ఆఫీసర్లు మాత్రం డివిజన్ల ఏర్పాటులో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంకా జీవో రాలేదు కదా.. అనే ఆలోచనతో డివిజన్ల ఏర్పాటు విషయంలో నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించారు. ఇదే టైంలో కార్పొరేషన్ ఏర్పాటుపై జీవో రిలీజ్ కావడంతో డివిజన్ల ముసాయిదా రిలీజ్ చేయాలని పేర్కొనడంతో ఇప్పుడు ఆఫీసర్లు హడావుడిగా డివిజన్ల ఏర్పాటు పనులు మొదలు పెట్టారు. ఏవైనా మార్పులు, చేర్పులుంటే తర్వాత చూసుకోవచ్చనేలా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.