మిర్యాలగూడ, వెలుగు :నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను శనివారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన మోత్కూరు రమణాచారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మోహన్ రెడ్డి జడ్చర్లలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కాగా ఏప్రిల్ 23న పాత స్నేహితుడైన లావూరు తండాకు చెందిన రమేశ్ను కలవడానికి దామరచర్లకు వచ్చారు.
మండల కేంద్రంలోని వైన్ షాప్ లో మద్యం సేవించిన అనంతరం ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఏటీఎంలో దొంగతనం చేయాలని భావించి, యూట్యూబ్ లో వీడియోలను చూశారు. అర్ధరాత్రి ఏటీఎంలోకి వెళ్లి రాడ్ తో ఏటీఎంను పగలగొట్టడంతో అలారం మోగగా అక్కడ నుంచి పరారయ్యారు. సీసీ టీవీ కెమెరాలను ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, వారిని పట్టుకున్నట్టు సీఐ తెలిపారు.
