వనపర్తిలో దారుణం.. బిడ్డను చంపిన తండ్రి

వనపర్తిలో దారుణం.. బిడ్డను చంపిన తండ్రి

పెబ్బేరు : ప్రేమ పేరుతో కుటుంబ పరువు తీస్తోందంటూ బిడ్డను చంపిండో తండ్రి. ఈ దారుణం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో జరిగింది. పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక్క కొడుకు ఉన్నారు. రెండో బిడ్డ గీత (15) పెబ్బేరు హైస్కూల్ లో 10వ తరగతి చదువుతోంది. గీత, అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయి కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా రాజశేఖర్ కు తెలిసింది. దీంతో ఆయన అవమానంగా భావించాడు. బిడ్డను మూడు, నాలుగు సార్లు మందలించాడు. ఈ క్రమంలో దీపావళి కోసమని కుటుంబసభ్యులందరూ ఆదివారం అమ్మమ్మ ఊరైన వనపర్తి మండలం చందాపూర్ కు వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం సాయంత్రం రాజశేఖర్, గీత మాత్రమే పాతపల్లికి వచ్చారు. అయితే అదే రోజు రాత్రి బిడ్డను రాజశేఖర్ కొట్టాడు. మంగళవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆ టైమ్ లో గీత నానమ్మ శంకరమ్మ ఇంట్లో లేదు. ఈ క్రమంలో గొడవ పెద్దదై క్షణికావేశంలో బిడ్డ గొంతు, చెవి, మెడ కింది భాగంలో రాజశేఖర్ పొడిచాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత రాజశేఖర్ ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి పొలానికి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన శంకరమ్మ ఇంటికి వచ్చే సరికి గీత రక్తపు మడుగులో పడి ఉంది. చుట్టుపక్కలోళ్లు వచ్చి రాజశేఖర్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొలం నుంచి ఇంటికి వచ్చిన రాజశేఖర్ ఏమీ తెలియనట్లు నటించాడు. అనుమానంతో పోలీసులు విచారించగా బిడ్డను చంపినట్లు ఒప్పుకున్నాడు. వనపర్తి డీఎస్పీ ఆనందరెడ్డి, కొత్తకోట ఇన్​చార్జ్  సీఐ కేఎస్ రత్నం, ఎస్సై రామస్వామి స్పాట్ కు వచ్చి పరిశీలించారు. రాజశేఖర్ ను అరెస్టు చేసి పెబ్బేరు స్టేషన్ కు తరలించారు. గీత డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.