
- మెరుపు మంధాన 77 బాల్స్లోనే సెంచరీ
- రెండో వన్డేలో ఇండియా రికార్డు విక్టరీ
- 102 రన్స్ తేడాతో ఆసీస్ చిత్తు
ముల్లాన్పూర్: స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (91 బాల్స్లో14 ఫోర్లు, 4 సిక్సర్లతో 117) సూపర్ సెంచరీతో విజృంభించడంతో భారీ విజయంతో ఆస్ట్రేలియాను టీమిండియాను దెబ్బకు దెబ్బ తీసింది. తొలి మ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన ఇండియా 102 రన్స్ తేడాతో కంగారూ టీమ్ను చిత్తుగా ఓడించి సిరీస్ను 1–1తో సమం చేసింది.
రన్స్ పరంగా ఆసీస్కు ఇది అతి పెద్ద ఓటమి కావడం విశేషం. వన్డేల్లో ఆస్ట్రేలియాపై స్వదేశంలో 18 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాకు ఇదే తొలి విజయం. చివరగా 2007లో చెన్నైలో ఆసీస్ను ఓడించింది. తాజా విక్టరీతో వరుసగా 13 వన్డేల్లో ఓటమి ఎరుగని ఆసీస్ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ఇండింయా 49.5 ఓవర్లలో 292 రన్స్కు ఆలౌటైంది. మంధాన ఇండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ (77 బాల్స్లో) సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచింది.
ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) రికార్డు కూడా మంధాన పేరు మీదే ఉంది. ఆల్రౌండర్ దీప్తి శర్మ (40) కూడా రాణించింది. అనంతరం ఛేజింగ్లో ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 190 రన్స్కే చేతులెత్తేసింది. ఎలీస్ పెర్రీ (44), అనాబెల్ సదర్లాండ్ (45) మాత్రమే పోరాడారు. యంగ్ పేసర్ క్రాంతి గౌడ్ (3/28) మూడు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగా.. దీప్తి (2/24) రెండు వికెట్లతో దెబ్బ కొట్టింది. రేణుకా సింగ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ విన్నర్ను తేల్చే మూడో, చివరి వన్డే ఈనెల 20న జరగనుంది.
స్మృతి సూపర్
తొలి పోరులో తడబడిన ఇండియా ఈ మ్యాచ్లో మాత్రం అన్ని విభాగాల్లో అదరగొట్టింది. యంగ్స్టర్ ప్రతీక రావల్ (25)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మంధాన ఆరంభం నుంచే తన మార్కు ఆట చూపెట్టింది. తొలి వికెట్కు 11.3 ఓవర్లలో 70 రన్స్ జోడించి మంచి ఆరంభం అందించింది. మరో ఎండ్లో మంచి టచ్లో కనిపించిన రావల్ ఆష్లే గార్డ్నర్ బౌలింగ్లో అనవసర షాట్కు యత్నించి కవర్లో జార్జియా వేర్హామ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మంధాన మాత్రం తన దూకుడు ఆపలేదు. దీప్తి శర్మ తోడుగా జోరు కొనసాగించింది. ముఖ్యంగా లెగ్ సైడ్ దిశగా ఆడిన షాట్లతో ఈజీగా రన్స్ రాబటటింది. ఈ క్రమంలో 45 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె.. జార్జియా వారెహమ్ బౌలింగ్లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడింది.
తాలియా మెక్గ్రాత్ బౌలింగ్లో మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీతో సెంచరీ అంకుంది. అయితే, 33వ ఓవర్లో మెక్గ్రాత్ బౌలింగ్లోనే భారీ షాట్కు ప్రయత్నించి మిడ్వికెట్ వద్ద గార్డనర్కు క్యాచ్ ఇచ్చి మంధాన ఇన్నింగ్స్ ముగిసింది. రిచాఘోష్ (29), స్నేహ్ రాణా (24) తోడుగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన దీప్తి శర్మ జట్టుకు మంచి స్కోరు అందించింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు, గార్డ్నర్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఆసీస్ ఢమాల్
భారీ టార్గెట్ ఛేజింగ్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. రెండో ఓవర్లోనే జార్జియా వోల్ (0)ను రేణుక పెవిలియన్ పంపగా, ప్రమాదకర అలీసా హీలీ (9)ని క్రాంతి గౌడ్ ఔట్ చేసింది. పెర్రీ, సదర్లాండ్ ప్రతిఘటించినా పెరుగుతున్న రన్రేట్ వాళ్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది.
పెర్రీ.. బెత్ మూనీ (18)తో మూడో వికెట్కు 50, సదర్లాండ్తో నాలుగో వికెట్కు 46 రన్స్ జోడించింది. పెర్రీని రాధా యాదవ్ మంచి రిటర్న్ క్యాచ్తో ఔట్ చేయగా, దూకుడుగా ఆడుతున్న సదర్లాండ్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత క్యాచ్తో పెవిలియన్ పంపింది. ఆ తర్వాత గార్డ్నర్ (17), తాలియా (16) కూడా విఫలమవడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది.