న్యూఢిల్లీ : ప్యాసింజర్ వెహికల్స్, టూవీలర్లు సహా అన్ని విభాగాలూ దూసుకుపోవడంతో ఈ ఏడాది ఆగస్టులో భారతదేశంలో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 9 శాతం పెరిగాయి. మొత్తం రిటైల్ విక్రయాలు 2022 ఆగస్టులో 16,74,162 యూనిట్ల నుంచి 9 శాతం వృద్ధితో గత నెలలో 18,18,647 యూనిట్లకు పెరిగాయి. వెహికల్స్ రిజిస్ట్రేషన్లు 2022 ఆగస్టులో 2,95,842 యూనిట్ల నుంచి గత నెలలో 7 శాతం పెరిగి 3,15,153 యూనిట్లకు పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో కస్టమర్ స్కీమ్లు, మెరుగైన సరఫరా, సానుకూల మార్కెట్ సెంటిమెంట్స్ వల్ల అమ్మకాలు పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. టూవీలర్స్ విక్రయాలు గత ఏడాది ఇదే నెలలో 11,80,230 యూనిట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధితో 12,54,444 యూనిట్లకు చేరుకున్నాయి.
కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు గత ఏడాది ఇదే నెలలో 72,940 యూనిట్ల నుంచి 3 శాతం పెరిగి 75,294 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ సేల్స్ ఆగస్టులో 14 శాతం పెరిగి 73,849 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు సంవత్సరంలో 65,018 యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రీవీలర్ రిటైల్ అమ్మకాలు 2022 ఆగస్టులో 60,132 యూనిట్ల నుంచి 66 శాతం పెరిగి 99,907 యూనిట్లకు చేరుకున్నాయి. ఓనమ్తో ఈసారి పండుగల సీజన్ ప్రారంభమయిందని, మార్కెట్ మూడ్ని ఉత్సాహపరిచిందని సింఘానియా తెలిపారు. లిక్విడిటీ బాగుందని, సరఫరా గొలుసులోని అడ్డంకులు తొలగిపోయాయని ఆయన తెలిపారు. తగినంత వర్షపాతం లేకపోవడం ధరల పెరుగుదలకు దారితీస్తుందని, వినియోగదారుల కొనుగోలు శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని సింఘానియా పేర్కొన్నారు. వానల లోటు వల్ల ఖరీఫ్ పంటల దిగుబడి దెబ్బతినడమే కాకుండా రబీ పంటలపైనా ఎఫెక్ట్ ఉండొచ్చని వివరించారు.