జోరు వానలో.. వేడి వేడి పకోడి, ఘాటు బజ్జీ, బోండాలు.. నోట్లో నీళ్లూరిస్తాయి. కానీ, అలా మనసు కోరిందల్లా తింటే.. శరీరం జీర్ణించుకోలేదు. పైగా ఈ కాలం కొన్ని కూరగాయలపై బ్యాక్టీరియా, కొన్ని రకాల కెమికల్స్ తిష్ట వేస్తాయి. అవి తింటే తిప్పలు తప్పవు. అందుకే ఈ సీజన్లో కాస్త దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
వానాకాలం చేపలు, రొయ్యలు లాంటి సీ ఫుడ్కి వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఈ కాలం నీళ్లలో వ్యాధికారకాలు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల చేపలకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవి తినడం వల్ల మనమూ ఎఫెక్ట్ అవుతాం. పైగా ఈ సీజన్లో చేపల్లో పునరుత్పత్తి ఎక్కువగా జరుగుతుంటుంది. అది కూడా ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది.
పకోడి, కచోరి, సమోసా.. లాంటివి ఈ కాలంలో అస్సలు తినకూడదని కాదు. అలాగని, నచ్చినంత తింటామంటే కుదరదు. వీటిల్లోని నూనె.. కడుపునొప్పికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, డయేరియా ఇబ్బంది పెడతాయి. అందుకే ఈ కాలం ఫ్రైడ్ ఫుడ్స్ని మోతాదులోనే తినాలి. అది కూడా వారం, పదిరోజులకి ఒకసారి తినాలి. అలాగే కొన్నిసార్లు వర్షం పడేముందు, పడ్డాక బాగా ఉక్కపోస్తుంటుంది. అలాంటప్పుడు రిలాక్సేషన్ కోసం కార్బోహైడ్రేట్స్తో నిండిన కూల్డ్రింక్స్ తాగకూడదు.. ఇవి కూడా కడుపులో ఇబ్బందికి కారణం అవుతాయి.
తడి నేలలో పుట్ట గొడుగులు పెరుగుతాయి. పైగా ఇవి భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. దాంతో వర్షం కురిసినప్పుడు వాటిపై మురికి నీరు, దాని ద్వారా బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. అందుకే ఈ కాలం ఇన్డోర్లో సాగు చేసిన మష్రూమ్స్ని మాత్రమే తినాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని పచ్చిగా తినకూడదు.
కీటకాలు, పురుగు మందుల నుంచి వంకాయ తనని తాను కాపాడుకోవడానికి ఆల్కలాయిడ్స్ అనే కెమికల్స్ని ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే వానాకాలం వంగ చెట్లపై కీటకాలు ఎక్కువగా దాడి చేస్తాయి. దాంతో పెస్టిసైడ్స్ మోతాదుకి మించి కొడుతుంటారు. అవి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, గీతలు రావచ్చు. వికారం లాంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ కాలం వాటిని కాస్త పక్కనపెట్టాలి.
రోటి, నిల్వ పచ్చళ్లు, చింత పండుతో చేసిన పులుసులు ఈ కాలం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. చల్లటి వాతావరణం వల్ల ఈ కాలం అసలే నీళ్లు తాగాలనిపించదు. దానికి తోడు ఒంట్లోని నీటి శాతం కూడా తగ్గితే.. గొంతు సమస్యలొస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది.