దుబాయ్‌ ఎయిర్ పోర్ట్ క్లోజ్.. ఇరాన్ దాడులతో పరిస్థితి అల్లకల్లోలం

దుబాయ్‌ ఎయిర్ పోర్ట్ క్లోజ్.. ఇరాన్ దాడులతో పరిస్థితి అల్లకల్లోలం

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం గల్ఫ్ దేశాలకు.. మరీ ముఖ్యంగా దుబాయ్కి పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా బేస్ క్యాంపులపై దాడుల పేరుతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లిన భారతీయులు ఏ క్షణం ఏం బాంబు వచ్చి మీద పడుతుందోననే భయాందోళనలో ఉన్నారు.

పోనీ.. ఆ దేశాల నుంచి బయటపడి మన దేశానికి వద్దామంటే.. గల్ఫ్ దేశాలు ఎయిర్ స్పేస్లు మూసివేయడంతో విమానాల రాకపోకలు బంద్ అయిపోయాయి. దుబాయ్‌లోని అన్ని విమానాశ్రయాలు మూసివేశారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని అధికారులు సూచించారు. దుబాయ్‌ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే విమానాలపై కూడా ఈ ప్రభావం పడింది.

హైదరాబాద్ ఎయిర్ పోర్టుతో సహా మన దేశంలోని చాలా ఎయిర్ పోర్టుల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు రద్దయిన పరిస్థితి. ఉన్నపళంగా విమానాలు రద్దు కావడంతో అత్యవసర పనుల మీద వెళ్లే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్న దయనీయ పరిస్థితులు ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు విమానాశ్రయాలు ప్రయాణికులకు ఒక కీలక సూచన చేశాయి. ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకునే లోపు సంబంధిత విమానాలు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయో.. లేదో సదరు విమానయాన సంస్థలను సంప్రదించాలని ఎయిర్ పోర్టు అధికారులు ప్రయాణికులకు సూచించారు.

దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఇరాన్ మిస్సైల్ అటాక్ చేయడానికి ప్రయత్నించగా.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ మిస్సైల్ను గాల్లోనే పేల్చేసింది. ఈ పరిణామంతో బుర్జ్ ఖలీఫా దగ్గర, చుట్టుముట్టూ ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.