నోట్ల కట్టలతో వెళుతున్న విమానం కూలింది : ఎగబడి డబ్బులు ఎత్తుకెళ్లిన జనం

నోట్ల కట్టలతో వెళుతున్న విమానం కూలింది : ఎగబడి డబ్బులు ఎత్తుకెళ్లిన జనం

బొలివియా దేశం. సీ 130 మోడల్‎కు చెందిన ఆర్మీ కార్గో విమానం. బొలివియా రాజధాని లాపాజ్ సమీపంలోని.. ఆల్గో అనే సిటీలోని జాతీయ రహదారిపై కూలిపోయింది. 15 మంది చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ఇక్కడే ట్విస్ట్. ఈ విమానంలో నోట్ల కట్టలు ఉన్నాయి. మూటలకు మూటలు డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుతోనే ఆ విమానం వెళుతుంది. విమానం కూలటంతోపాటు రెండు ముక్కలు అయ్యింది. విమానంలోని డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. 

విమానం కూలిన తర్వాత.. అందులోని డబ్బు కట్టలు రోడ్డుపై పడటంతో.. వందల మంది అక్కడికి వచ్చారు. విమానంలోని ప్రయాణికులను రక్షించటం మానేసి.. గాయపడిన వాళ్లకు సాయం చేయటం మానేసి.. విమానంలోని డబ్బు కట్టలను ఎత్తుకెళ్లారు జనం. 

డబ్బుల విషయం తెలిసిన వెంటనే.. వేలాది మంది కార్లు, బైక్స్ వేసుకుని మరీ యాక్సిడెంట్ స్పాట్ కు వచ్చారు. డబ్బులను ఏరుకోవటానికి పోటీ పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. పోటీ పడి మరీ డబ్బుల కోసం కొట్టుకున్నారు. దొరికిన వాళ్లకు దొరికినంత ఎత్తుకెళ్లారు. 

జనాన్ని కంట్రోల్ చేయటానికి పోలీసులకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. అయినా తగ్గేదేలా అన్నట్లు.. డబ్బుల కోసం జనం ఎగబడ్డారు. దొరికిన వారికి దొరికినంత తీసుకున్న తర్వాత.. ఇక డబ్బులు లేవు అని నిర్థారణకు వచ్చిన తర్వాత వెనుదిరిగారు జనం. 

ఈ డబ్బు బొలివియా సెంట్రల్ బ్యాంక్ కు చెందినది. కొత్త నోట్లను ప్రింట్ చేసిన బ్యాంక్.. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను డబ్బును తరలించటంలో భాగంగా.. ఆర్మీకి చెందిన విమానంలో.. అత్యంత భద్రత మధ్య ఈ డబ్బును తరలిస్తుంది. ఈ క్రమంలోనే విమానం కూలిపోయింది. విమానంలోని డబ్బు రోడ్డుపై పడింది.. ఆ డబ్బు కోసం జనం ఎగబడ్డారు.. కొట్టుకున్నారు.. ఎలాగైతే ఏం మొత్తం డబ్బును ఎత్తుకెళ్లారు.